మన ఈనాడు: చింతకాని మండలం నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయంలో మాతృభాషా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతృభాష తెలుగు యొక్క గొప్పతనాన్ని మాతృభాష నేర్చుకోవటం వల్ల కలుగు ప్రయోజనాన్ని విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్ విద్యార్థులకు వివరించారు.
స్థానిక భాష గుర్తింపులో ముఖ్యమైన భాగంగా తెలుగు భాష కావటం మనకు గర్వకారణం అని ఆయన పేర్కొన్నారు. మాతృభాషను బాగా నేర్చుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ స్వంత గుర్తింపును పొందవచ్చు అన్నారు . ఇది ప్రపంచంలోని విభిన్న సంస్కృతుల పట్ల పూర్తిస్థాయి అవగాహన కలిగిస్తుంది అన్నారు.
సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కఠిన పదాల డిక్టేషన్ , మంచి దస్తూరి, చిత్రలేఖనం, మాతృభాష ఆవశ్యకత అనే అంశంపై వ్యాసరచన, పద్యాలు రాగ భావ యుక్తంగా ఆలపించడం, తెలుగు వారందరం తెలుగులోనే మాట్లాడదాం, కథ చెప్పటం అనే అంశాలపై ప్రతిభ పోటీ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చావా అరుణ్ కుమార్, తెలుగు ఉపాధ్యాయురాలు బోళ్ళా రేణుక, ఉపాధ్యాయులు గోపి, వినీల, కిరణ్, పార్వతి, భీమల్, శ్రీనివాస్, సుజాత , రాధా, త్రివేణి, రాశి , శైలజ తదితరులు పాల్గొన్నారు.