ManaEnadu:ఎంతో మంది పోరాటయోధుల ప్రాణత్యాగ ఫలం 78 ఏళ్ల స్వతంత్ర భారతం. 200ఏళ్లకు పైగా బ్రిటీష్ పాలనపై ఎంతో మంది యోధులు తిరుగుబాటు చేసి ప్రాణాలర్పించి స్వతంత్ర భారతావనిని మనకు ఇందించారు. అలా భరతమాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని 78 వసంతాలు పూర్తయింది. ఈ స్వేచ్ఛ కోసం చేసిన సంగ్రామంలో ఎంతో మంది యోధులు, కళాకారులు ప్రాణాలర్పించారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. స్వాతంత్య్ర పోరాటం, సమరయోధుల స్ఫూర్తితో టాలీవుడ్లో తెరకెక్కిన కొన్ని సినిమాలు గురించి తెలుసుకుందాం. ప్రతి భారతీయుడు ఈ సినిమాలను తన జీవితంలో కనీసం ఒక్కసారైనా చూసి తీరాల్సిందే. మరి ఆ చిత్రాలు ఏంటంటే..?
అల్లూరి సీతారామరాజు
తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా.. దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా అంటూ స్వాతంత్ర్యం కోసం ఆంగ్ల దొరలపై నిప్పుల చెరిగిన తెలుగు వీరుడు ‘అల్లూరి సీతారామరాజు’. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. ‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు’ అని కృష్ణ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఫేమస్.
సైరా నరసింహారెడ్డి
‘రేనాడు వీరులారా- చరిత్రలో మనం ఉండకపోవచ్చు, చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి’ అంటూ మెగాస్టార్ లీడ్లో టాలీవుడ్లో వచ్చిన మరో సినిమా సైరా నరసింహా రెడ్డి. స్వాతంత్య్రం కోసం జరిగిన తొలి యుద్ధంలో వీరోచితంగా పోరాడిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటును కథాంశంగా దర్శకుడు సురేంద్ర రెడ్డి సైరా నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు.
ఇద్దరు వీరుల కథ.. ఆర్ఆర్ఆర్
ఆంగ్లేయుల తూటాలకు ఎదురెళ్లిన అల్లూరి.. నిజాంపై పోరు జరిపిన గోండు వీరుడు కొమరం భీమ్ స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్గా జూనియర్ ఎన్టీఆర్ ఒదిగిపోయారు.
మహాత్మా గాంధీ జీవితకథ ఆధారంగా 1982లో రిచర్డ్ ఆటెన్బరో తెరకెక్కించిన ‘గాంధీ’ సినిమా ఏకంగా 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న విషయం తెలిసిందే.
హిందీలో జాతీయోద్యమ కథలతో ‘ప్రేమ్కహానీ’ (1975), ‘క్రాంతి’ (1981), ఆమిర్ఖాన్ ‘లగాన్’, ‘మంగళ్పాండే’, ‘రంగ్ దే బసంతి’ వంటి సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి.






