ManaEnadu:ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ (IMDb) తాజాగా ఎక్కువ పాపులర్ అయిన భారతీయ నటీనటుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అనూహ్యంగా నటి శోభిత ధూళిపాళ టాప్ 2లో నిలిచింది. అంతే కాదండోయ్ ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ను బీట్ చేసింది. ఈ లిస్టులో షారుక్ మూడో స్థానంలో నిలవగా టాప్ -1 స్థానాన్ని బాలీవుడ్ భామ శార్వరీ వాఘ్ సొంతం చేసుకుంది.
ఇండియన్ మూవీ డేటాబేస్ తాజాగా ఈ వారం పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్ను రిలీజ్ చేసింది. ఈ లిస్టులో టాలీవుడ్ బ్యూటీ శోభిత ధూళిపాళ పలువురు స్టార్లను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల ఈ భామ టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీళ్ల నిశ్చితార్థం గురించే గత మూడ్రోజులుగా నెట్టింట చర్చ జరుగుతోంది.
ఇందులో భాగంగా చాలా మంది నెటిజన్లు శోభిత ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలను ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు. ఇలా శోభిత న్యూస్ వైరల్ కావడంతో ఒక్కసారిగా ఆమె పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఆమె ఈ వారం ఇండియన్ పాపులర్ సెలబ్రిటీగా నిలిచింది. ప్రస్తుతం శోభిత టాలీవుడ్, బాలీవుడ్తో పాటు హాలీవుడ్లోనూ బిజీ అయిపోయింది. ‘మంకీ మ్యాన్’ తో అక్కడి ప్రేక్షకులను అలరించింది ఈ భామ. దేవ్ పటేల్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.
మరోవైపు ఐఎండీబీ మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో నాలుగో స్థానంలో కాజోల్.. ఐదో స్థానంలో జాన్వీ కపూర్ చోటు దక్కించుకున్నారు. ఇక పారిస్ ఒలింపిక్స్లో తన రివర్స్ షాట్తో అదరగొట్టి పాపులర్ అయిన బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్, బాలీవుట్ బ్యూటీ దీపికా పదుకొణె, మహారాజతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో విజయ్ సేతుపతి, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ఐశ్వర్య రాయ్ ఈ టాప్-10లో చోటు సంపాదించుకున్నారు.






