Mana Enadu:బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి మాయావతికి పంపించారు. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్లో చేరనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి మాయావతికి పంపించారు. ఇటీవల రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా బీఎస్పీ కి రెండు స్థానాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్, నాగర్ కర్నూల్ రెండు ఎంపీ స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయనుంది. నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. తాజాగా బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తన రాజీనామా అనంతరం నంది నగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు ప్రవీణ్ కుమార్. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్ లో చేరనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ప్రవీణ్ కుమార్ రాజీనామా తో బీఎస్పీ బీఆర్ఎస్ మధ్య ఉన్న పొత్తు కొనసాగుతుందా? లేదా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.