Mana Enadu:పారిస్ ఒలింపిక్స్ 2024లో వివాదాస్పద రీతిలో అనర్హత వేటు ఎదుర్కొన్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్కు యావత్ భారతావని అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ప్రముఖ క్రీడాకారుల వరకూ అందరూ వినేశ్ కు మద్దతుగా వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా లెజెండరీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కూడా వినేశ్ కు సపోర్టుగా వచ్చాడు. ‘టైమ్ ఫర్ అంపైర్స్ కాల్’ అనే టైటిల్ పెట్టి వినేశ్ రజత పతకానికి అర్హురాలని సచిన్ ట్వీట్ చేశాడు.
ప్రతి ఆటకు రూల్స్ ఉంటాయని.. అయితే ఆ రూల్స్ ను సందర్భానుసారంగా చూడాల్సి ఉంటుందని సచిన్ అన్నాడు. కొన్నిసార్లు వాటిని పరిశీలించాల్సి వస్తుందని.. వినేశ్ ఫోగాట్ ఫైనల్స్కు ఫెయిర్ అండ్ స్క్వేర్గా అర్హత సాధించిందని.. ఆమె అధిక బరువుతో డిస్క్వాలిఫై అయింది ఫైనల్స్కి ముందు మాత్రమేనని తెలిపాడు. ఆమె సిల్వర్ మెడల్ని లాక్కోవడంలో లాజిక్, స్పోర్టింగ్ సెన్స్ లేవని సచిన్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. పెర్ఫార్మెన్స్ మెరుగు పర్చుకునేందుకు డ్రగ్స్ ఉపయోగిస్తే అనర్హత వేటు వేయడంలో అర్థం ఉందని.. కానీ వినేశ్ చాలా చక్కటి ప్రదర్శనతో ఫైనల్స్కు చేరుకుందని, ఆమె సిల్వర్ మెడల్కి అర్హురాలని సచిన్ అభిప్రాయపడ్డాడు.