ManaEnadu:బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్లో భాగంగా నాసా (NASA) ఈ ఏడాది జూన్లో 10 రోజులప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. ఈ మిషన్లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ స్టార్లైనర్ వ్యోమనౌకలో జూన్ 5వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. జూన్ 14న వీరు భూమికి తిరుగు పయనం కావాల్సిఉండగా.. స్టార్లైనర్ (Boeing Starliner) వ్యోమనౌకలోని థ్రస్టర్లలో లోపాలు తలెత్తటంతో పాటు హీలియం లీకేజీ మొదలైంది. దీనివల్ల సాంకేతిక సమస్యలు ఎదురవ్వడం.. వాటిని పరిష్కరించడంలో జాప్యం కావడంతో వ్యోమగాముల తిరుగు ప్రయాణం ఆలస్యమవుతూ వచ్చింది.
అయితే వ్యోమగాములు లేకుండానే బోయింగ్ స్టార్లైనర్ (Boeing Starliner) వ్యోమనౌక భూమిని చేరింది. ఈ క్రమంలో నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్ మొదటిసారిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నట్లు నాసా వెల్లడించింది. సెప్టెంబర్ 13న ఎర్త్ టు స్పేస్ కాల్లో ఈ ఇద్దరు వ్యోమగాములు మాట్లాడనున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని, ఇందు కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో న్యూస్ కాన్ఫరెన్స్ ఏర్పాటుచేశారని పేర్కొంది. ఈ మిషన్లో వారు ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలను ప్రజలతో పంచుకుంటారని, ఐఎస్ఎస్లో వారు చేస్తున్న శాస్త్రీయ పరిశోధనల గురించి వెల్లడిస్తారని వివరించింది.
మరోవైపు స్టార్లైనర్ స్పేస్క్రాఫ్ట్ (Starliner Spacecraft) లో సమస్య తలెత్తడంతో వారు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించిన బోయింగ్.. వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్లైనర్ సురక్షితమే అని చెప్పినా నాసా అందుకు అంగీకరించలేదు. దీంతో స్టార్ లైనర్ న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో సురక్షితంగా కిందకు దిగిన విషయం తెలిసిందే.