Mana Enadu: హైదరాబాద్లో హైడ్రా(HYDRAA) దూకుడు కొనసాగుతోంది. తాజాగా మాదాపూర్లో హీరో నాగార్జున(Nagarjuna)కు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్(N-Convention Centre)ను కూల్చివేసింది. భారీ భద్రత మధ్య హైడ్రా బృందం ఈ పనులు చేపట్టింది. మూడున్నర ఎకరాల తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్-కన్వెన్షన్ నిర్మించినట్లు ఆరోపణలున్నాయి. హీరో నాగార్జున, నల్ల ప్రీతమ్ రెడ్డి కలిసి సంయుక్తంగా HYD మాదాపూర్లో N3 ఎంటర్ప్రైజెస్ పేరుతో N-కన్వెన్షన్ సెంటర్ను 2015లో నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో ఈ కన్వెన్షన్ సెంటర్ ఉండగా.. 1.12 ఎకరాలు FTL పరిధిలో, 2 ఎకరాల బఫర్ జోన్ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది.
టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు చెందిన హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎప్పటి నుంచో వివాదంలో ఉంది. మాదాపూర్లోని చెరువును ఆక్రమించి దీన్ని నిర్మించారన్నది ఆరోపణ. 2014లో కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేసి FTLలో నిర్మించారని తేల్చారు. మిగతా నిర్మాణాలను కూల్చిన అధికారులు.. ఈ కన్వెన్షన్ సెంటర్ జోలికి వెళ్ళలేదు. తాజాగా హైడ్రా భారీ సెక్యూరిటీ, పెద్ద పెద్ద యంత్రాలతో దాన్ని కూల్చివేస్తోంది. రేవంత్ రెడ్డి 2016లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా చెరువును సగం వరకు ఆక్రమించి N కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని సభ దృష్టికి తీసుకెళ్లారు. అక్కినేని నాగార్జున అక్రమ నిర్మాణంపై పేపర్లలో వచ్చినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని, ఏ శక్తులు అడ్డుకుంటున్నాయని ప్రశ్నించారు. తాజాగా రేవంత్ సీఎం అయ్యాక ఆ కన్వెన్షన్ సెంటర్ను ఆయన హైడ్రా ద్వారా కూల్చివేయించారు.
తమ్మిడి కుంటను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ నెల 21న హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కోరారు. కుంటకు తూర్పు భాగంలో FTL పరిధిలోనే నిర్మించడంతో చెరువులో నీరు ఉండే ప్రాంతం తగ్గిపోయిందని తెలిపారు. FTL మ్యాప్ను షేర్ చేస్తూ చెరువులోనే నిర్మించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి అని.. దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని వ్యాఖ్యానించారు.
కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూల్చేశారు: అక్కినేని నాగార్జున
ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చేయడంపై అక్కినేని నాగార్జున స్పందించారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ చట్ట విరుద్ధంగా కూల్చేశారన్నారు. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఇది పట్టా భూమి అని ఆయన తెలిపారు. చెరువులో ఒక అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదని, ప్రైవేట్ ల్యాండ్లోనే నిర్మించినట్లు స్పష్టం చేశారు. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పేర్కొన్నారు.
రుణమాఫీపై ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ డ్రామా: BRS
రైతు రుణమాఫీ, ఇతర సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ‘హైడ్రా’ నాటకానికి తెరలేపారని BRS విమర్శిస్తోంది. చెరువుల స్థలాల్లో నిర్మించిన మంత్రులు, కాంగ్రెస్ నేతల ఇళ్లను, ఫామ్ హౌస్లను కూల్చేస్తారా? అని ఆ పార్టీ నేతలు నిలదీస్తున్నారు. ఇవాళ కూల్చిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్లోనే 2015లో రేవంత్ రెడ్డి తన కూతురి ఎంగేజ్మెంట్ జరిపారని గుర్తు చేస్తున్నారు. మరోవైపు హైడ్రా ఉక్కుపాదం మోపడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా ఇలానే దూకుడుగా ముందుకెళ్లి పార్టీలతో సంబంధం లేకుండా అక్రమ నిర్మాణాలు కూల్చాలని నెటిజన్లు కోరుతున్నారు. ఆయా నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఇలానే ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి చెందిన స్థలాలు, చెరువులను రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.