Mana Enadu:కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాదాపు 300ల మందికిపైగా మరణించగా.. వందలమంది ఆచూకీ గల్లంతయింది. ఇక ఈ ప్రకృతి ప్రకోపం నుంచి ఇప్పట్లో కేరళ బయటపడటం కష్టమేనని నిపుణులు అంటున్నారు. అయితే కేరళకు అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు ముందుకువస్తున్నారు.
ఇప్పటికే గౌతమ్ అదానీ వంటి వ్యాపారులు వయనాడ్ కోసం భారీగా విరాళం ప్రకటించారు. తాజాగా కేరళను ఆదుకునేందుకు పలువురు టాలీవుడ్ తారలు కూడా ఆపన్న హస్తం అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ. కోటి విరాళం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలుపుతూ.. ‘‘వయనాడ్ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతోంది. బాధితులు తమ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.’’ అని చిరంజీవి పోస్ట్లో రాసుకొచ్చారు. మరోవైపు అల్లు అర్జున్.. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు.

నటుడు మోహన్లాల్ వయనాడ్ లో స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొని తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రూ. 3 కోట్ల విరాళం బాధితుల కోసం అందించారు. మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిపి రూ.35 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు.
ఇక ఇప్పటికే తమిళ హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు, నయనతార – విఘ్నేశ్ శివన్ దంపతులు రూ.20 లక్షలు విరాళమిచ్చారు. , కమల్ హాసన్ రూ. 25 లక్షలు, విక్రమ్ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.
వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలమంది ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని కలిచి వేస్తోంది. ఘటన జరిగి దాదాపు వారం కావొస్తున్నా ఇంకా ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వందల మంది ఆచూకీ ఇంకా దొరకడం లేదు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ముందుకు వచ్చారు. ఈ ఘటనపై మలయాళ చిత్ర పరిశ్రమ విచారం వ్యక్తం చేస్తూ.. కొన్ని రోజుల పాటు సినిమా వేడుకలు, కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది






