తమిళ, కన్నడ వివాదం ముదురుతోంది. మొన్నటికి మొన్న బ్యాంకులో కన్నడ భాష మాట్లాడటంపై గొడవ పడ్డారు. ఆ మధ్య తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన పోస్టు కన్నడిగులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రస్తుతం కమల్ హాసన్ థగ్ లైఫ్ (thag life) ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫంక్షన్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్నడ నటుడు రాజ్ కుమార్ ను ఉద్దేశించి మీ భాష మా (తమిళం) నుంచే పుట్టిందని అనడంతో వివాదం రాజుకుంది.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్
హీరో కమల్ హాసన్ (kamal haasan) కు చరిత్ర తెలియదని అనుకుంటాను. ముందు కర్ణాటక చరిత్రను, కన్నడిగుల అభిప్రాయాలను తెలుసుకుని మాట్లాడాలి అని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. ఇదే విషయంపై కర్ణాటక లో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ తెలుసుకుని మాట్లాడాలని అంటున్నారు.
కమల్ హాసన్ సారీ చెప్పాలి
మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప (Yadiyurappa) కొడుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర కమల్ హాసన్ పై విమర్శలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను ప్రేమించాలి. అందులో తప్పులేదు. కానీ ఇతర భాషల పట్ల కూడా సరైన గౌరవం పెంచుకోవాలి. ఇతర భాషల్ని అగౌరపరిచేలా మాట్లాడటం ఏ మాత్రం సరికాదని అన్నారు. ఇప్పటికైనా కన్నడ ప్రజలకు కమల్ హాసన్ సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కన్నడ, తమిళ ప్రజల మధ్య కావేరి నది జలా వివాదం కొనసాగగా.. అప్పట్లో రెండు రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ భాష వివాదం ముదిరేలా కనిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడులో ద్విభాషా విధానాన్నే కొనసాగిస్తామని తమిళ్ ఫస్ట్ అని అంటున్నారు. ఇప్పుడు కన్నడ ప్రజలు మా భాష గొప్పదనం గురించి తమిళులకు తెలియదని అంటున్నారు. ఈ గొడవ కాస్త చినికి చినికి గాలివానలా మారేలా కనిపిస్తోంది.






