Mana Enadu : ఛత్తీస్గఢ్ (Chhattisgarh) దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది. నారాయణ్పుర్ – దంతెవాడ సరిహద్దుల్లో ఇవాళ (అక్టోబర్ 4వ తేదీ) భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.
14 మంది మావోయిస్టులు మృతి
బస్తర్ రేంజ్లోని దంతెవాడ – నారాయణ్పుర్ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్మాడ్ దండ కారణ్యంలోని తుల్తులి, నెందూర్ గ్రామాల మధ్య ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడ మావోయిస్టులు నక్కి ఉన్నారన్న సమాచారంతో చేపట్టిన ఆపరేషన్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ మీడియాకు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ అనంతరం 14 మంది మావోయిస్టుల (Naxals) మృతదేహాలతో పాటు ఏకే 47 రైఫిల్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
భద్రతా బలగాలపై మావోయిస్టుల కాల్పులు
“ఇప్పటికీ ఆ ప్రాంతంలో అడపాదడపా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బస్తర్ ప్రాంతంలో 171 మంది మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందింది. మా భద్రతా సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈరోజు మధ్యాహ్నం భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులు షురూ చేశారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు మరణించారు.” అని ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు.