Mana Enadu: చెరువులు, కాలువలు, కుంటలు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే అది ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూలగొడుతామని, అక్రమార్కుల భరత పడతామని సీఎం హెచ్చరించారు. కొంత మంది తమ విలాసాల కోసం చెరువులు, కుంటల్లో ఫామ్ హౌస్లు నిర్మించారని సీఎం అన్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని మరోసారి సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్లో హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేష స్థాపనోత్సవంలో రేవంత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. లేక్ సిటీ, గండిపేట, ఉస్మాన్ సాగర్ వంటివి హైదదాబాద్ దాహార్తిని తీర్చుతున్నాయి. ఇవే కాక గతంలో వందల కొద్దీ చెరువులు, కుంటలు ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని సీఎం సూచించారు. అయితే కొందరు ధనవంతులు తమ విలాసాల కోసం చెరువుల పక్కనే ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. వాటి నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని చెరువుల్లోకి విడుదల చేస్తున్నారన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే హైడ్రాని ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు ఆయన చెప్పొకొచ్చారు. ఇందుకు తనకు భగవద్గీతే ఆదర్శమని, అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలకు తనకు స్ఫూర్తి అని సీఎం అన్నారు.
తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కానీ,రాజకీయంగా గానీ శత్రుత్వం లేదని సీఎం పునరుద్ఘాటించారు. అక్రమ నిర్మాణాలను వదిలేస్తే తాను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్లేనని అన్నారు. అంతేకాదు అక్రమాలు చేస్తే ప్రతిపక్షం, అధికార పక్షం అనే తేడా చూడనని సీఎం స్పష్టం చేశారు. అధికార పక్షంలో ఉన్నా సరే వారు ఎంతటి వారైనా అక్రమ నిర్మాణాలు చేపడితే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.






