మన ఈనాడు:
BJP: తెలంగాణ ఎన్నికల్లో సత్తా చాటాలని భాజపా అడుగులు వేస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ముమ్మరం చేసింది. పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈ నెలలో ప్రధాని మోదీ, అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు. మరో వైపు అభ్యర్థులను ప్రకటించేందుకు BJP సిద్దమవుతోంది. కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు దాదాపు ఖరారు చేశారు. జాబితా విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది.
ఒకవేళ BJP ఆశించినన్ని సీట్లు సాధించలేకపోతే మిగతా రెండు పార్టీల్లో ఏదో ఒకటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధించే అవకాశం ఉంటుంది. అందుకే ఎన్నికల యుద్ధాన్ని త్రిముఖ పోటీగా మార్చి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో పోలింగ్ తేదీ సమీపించేకొద్దీ రాష్ట్రంలో బీజేపీ కూడా ప్రచారపర్వాన్ని మరింత ఉధృతం చేయాలని చూస్తోంది. నవంబర్ 28న ప్రచారం ముగిసేలోపు వీలైనన్ని ఎక్కువ సభల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రచారంలో పాల్గొనేలా పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది.
టికెట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కమలం పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే మహిళలకు టికెట్ల కోసం బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలియజేసేలా అభ్యర్థుల ఎంపికలో బీసీలకు పెద్దపేట వేస్తున్నామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో బీసీ కార్డుతో అసెంబ్లీ బరిలోకి దిగనుంది బీజేపీ. గెలుపు గుర్రాలు లక్ష్యంగా అభ్యర్థుల ప్రకటన చేసేలా ప్లాన్ చేస్తోంది.
ఇవాళ తెలంగాణ బీజేపీ అభ్యర్థులను రిలీజ్ చేసేందుకు అధిష్టానం రెడీ అయింది. ఢిల్లీలోని ప్రకాశ్ జవదేకర్ నివాసంలో తెలంగాణ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. అభ్యర్థులను ఫైనల్ చేసే ప్రక్రియలో భాగంగా తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల, డీకే అరుణ సమావేశానికి హాజరయ్యారు. కసరత్తు చేసిన జాబితాపై బీజేపీ జాతీయ అధ్యక్షుడితో చర్చించారు. సుమారు 40 నుంచి 50 మందితో తొలి జాబితా ప్రకటన చేసేందుకు కసరత్తు చేస్తోంది బీజేపీ అధిష్టానం.
ఇక బీజేపీ మ్యానిఫెస్టో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రకటించనున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీగా వరాలు ప్రకటించాయి. దీంతో బీజేపీ ఎలాంటి హామీలు ఇవ్వాలనే విషయంపై సమాలోచనలు చేస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలకు విభిన్నంగా కొత్త హామీలను పొందుపర్చనుంది. దీనిపై బీజేపీ వర్గాలు కసరత్తులు చేస్తోన్నాయి. ఇటీవల తెలంగాణకు వచ్చిన మోదీ నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రకటనతో పాటు ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఇది బీజేపీకి కలిసి వచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.