Mana Enadu : తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ (Sandhya Theatre Incident) వద్ద జరిగిన ఘటనపై (Sandhya Theatre Stampede) మాట్లాడారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈనెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట (Sandhya Theatre Stampede) ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేయాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరగా.. సీఎం స్పందించి ప్రకటన చేశారు. సంధ్య థియేటర్కు రావొద్దని పోలీసులు చెప్పినా వినకుండా అల్లు అర్జున్ వెళ్లారని తెలిపారు.
‘‘డిసెంబరు 2న చిక్కడపల్లి పీఎస్లో సంధ్య థియేటర్ యాజమాన్యం పుష్ప-2 (Pushpa 2 Benefit Show) టీమ్ థియేటర్ కు వస్తోందని బందోబస్తు కావాలని దరఖాస్తు చేసింది. అయితే థియేటర్ పరిసరాల్లో రెస్టారెంట్లు, ఇతర థియేటర్లు ఉండటం.. థియేటర్ కు ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ ఉండటంతో రద్దీ ఎక్కువగా ఉంటుందని చిక్కడపల్లి సీఐ సంధ్య థియేటర్ యాజమాన్యానికి లిఖితపూర్వక సమాధానం పంపించారు. పుష్ప-2 టీమ్ వస్తే జనాన్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుందని.. సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదని అందువల్ల ఆ టీమ్ రావడానికి అనుమతి ఇవ్వొద్దని దరఖాస్తు తిరస్కరిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
అయితే పోలీసులు అనుమతి నిరాకరించినా పుష్ప-2 ప్రీమియర్ షో (Pushpa 2 Fan Death News) రోజున రాత్రి 9.30 సమయంలో అల్లు అర్జున్ (Allu Arjun) థియేటర్కు వెళ్లారు. అయితే ఆయన ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద నుంచే తన కారులో రూఫ్టాప్ నుంచి చేతులు ఊపుతూ సంధ్య థియేటర్ వద్దకు చేరుకోవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్లు తమ అభిమాన హీరోని చూసేందుకు అక్కడికి వెళ్లారు. హీరో కారు థియేటర్లోకి పంపేందుకు గేటు తెరవడంతో అందరూ ఒక్కసారిగా లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయారు. గాయపడ్డ ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయితే పరిస్థితి చేయిదాటిపోయింది.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని స్వయంగా ఏసీపీ వెళ్లి అల్లు అర్జున్కు చెప్పినా తాను సినిమా చూసే వెళ్తానని ఆయన అన్నట్టు సిటీ కమిషనర్ నాతో చెప్పారు. ఎలాగో పోలీసులు బలవంతం చేసి అతన్ని థియేటర్ నుంచి పంపించే ఏర్పాట్లు చేస్తే.. ఆయన మరోసారి రూఫ్టాప్ ద్వారా చేతులు ఊపుతూ వెళ్లారు. ఈ ఘటనలో మహిళ చనిపోయింది.. కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా అదే పద్ధతి కొనసాగించారు.’’ అని సీఎం (CM Revanth Reddy) వివరించారు.
“ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్తో పాటు మరి కొంత మందిని అరెస్టు (Allu Arjun Arrest) చేశారని.. దర్యాప్తు కొనసాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే హీరోను పోలీసులు అరెస్టు చేయడంతో కొన్ని రాజకీయ పార్టీలు తనను నీచంగా తిడుతూ పోస్టులు పెట్టాయని మండిపడ్డారు. అయితే ఓ సాధారణ ప్రైవేటు ఉద్యోగి తన కుమారుడు బన్నీ ఫ్యాన్ కావడంతో ఒక్కో టికెటు రూ.3వేలు పెట్టి కుటుంబమంతా కలిసి రూ.12వేలతో సినిమాకు వెళ్తే తొక్కిసలాటలో తల్లి చనిపోయింది. కుమారుడు చావుబతుకుల్లో ఉన్నాడు. ఇది జరిగి 11 రోజులు అయినా ఆ హీరో. నిర్మాత ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లాడిని పరామర్శించేందుకు వెళ్లలేదు.
కానీ హీరో అరెస్టయి బెయిల్ (Allu Arjun Bail News)పై విడుదలయ్యాక ఆయణ్ను పరామర్శించేందుకు మాత్రం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటి వద్ద క్యూ కట్టింది. చావు బతుకుల్లో ఉన్న ఆ పిల్లాడిని పరామర్శించేందుకు మాత్రం ఎవరికీ మనసు రాలేదు. ఇదేం మానవత్వం. తమ విధుల్లో భాగంగా అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్తే దానిపైనా కొంతమంది రాజకీయం చేశారు. ఒకపూట జైలుకు వెళ్లిన హీరోను మాత్రం కాళ్లు చేతులు పోయిన మనిషిని చూడటానికి వెళ్లినట్లు వెళ్లారు. అక్కడేమైనా ఆయనకు కాలు పోయిందా.. కన్ను పోయిందా.. చేయి పోయాందా.. కానీ ఆస్పత్రిలో ఓ ప్రాణం పోయింది. మరో ప్రాణం బతికేందుకు ఆరాటపడుతోంది. మృత్యువుతో పోరాడుతోంది.” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.






