భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం (Bhadradri Temple)లో అపచారం జరిగింది. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా లక్ష ప్యాకెట్ల ముత్యాల తలంబ్రాలు పాడైపోయాయి. గతేడాది సీతారాముల కళ్యాణానికి (Sitharamula Kalyana,) ముత్యాల తలంబ్రాలు తయారు చేశారు. వాటిలో చాలా ప్యాకెట్లను పక్కన పెట్టారు. కానీ వాటి సక్రమంగా భద్రపరచడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో తలంబ్రాల ప్యాకెట్ల లోపల బియ్యం పాడైపోయి పురుగులు చేరాయి.
పాడైన 5 క్వింటాళ్ల తలంబ్రాలు
ఇక ఆలస్యంగా దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఆలయ అధికారులు ప్యాకెట్ల లోపల పాడైన తలంబ్రాలను (Talambralu), ముత్యాలను వేరు చేస్తున్నారు. సుమారు ఐదు క్వింటాళ్ల తలంబ్రాలు పాడైనట్లు సమాచారం. ఈ ప్యాకెట్లు లక్ష వరకు ఉంటాయని తెలిసింది. అయితే ఆలయ అధికారులు మాత్రం 28వేల ప్యాకెట్లు మాత్రమే పాడయ్యాయని చెప్పడం గమనార్హం.
ముత్యాలు వేరు చేస్తున్న సిబ్బంది
గతేడాది భక్తుల కోసం ఆలయ సిబ్బంది ఒక్కో తలంబ్రాల ప్యాకెట్లో రెండు ముత్యాలు (Pearls) వేసి ప్యాక్ చేశారు. వాటి విలువను రూ.25గా నిర్ణయించారు. ఈ ప్యాకెట్లను కొరియర్, పోస్టల్ ద్వారా నగదు చెల్లించిన భక్తుల ఇంటికి చేరవేయాల్సింది. అయితే అధికారుల నిర్లక్ష్యంతో అవి భక్తులకు చేరకుండానే పాడైపోయినట్లు సమాచారం. పాడైపోయిన తలంబ్రాల ప్యాకెట్లలోని ముత్యాలను మాత్రం మళ్లీ వాడేందుకు బియ్యం నుంచి ప్రస్తుతం సిబ్బంది వేరు చేస్తున్నారు.






