మన ఈనాడు: సంక్రాంతి పండుగ తెలంగాణ ఆర్టీసీకి కాసులు కురిపించింది. ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులోనే సుమారు రూ.12 కోట్లకు పైగానే ఆదాయం వచ్చింది. సీఎం రేవంత్ సర్కారు తీసుకొచ్చిన మహలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికులు సంఖ్య భారీగా పెరిగింది.దీంతో ఆర్టీసీ మొత్తంగా 6,621 ప్రత్యేక బస్సులు నడిపింది.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలు భారీ సంఖ్యలో పట్నం వదిలి ఊర్లకు వెళ్లిపోయారు. 13వ తేది ఒక్కరోజే 52.78 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఆర్టీసీకి ఆ ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. సుమారు రూ.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే మహిళలకు జారీ చేసే జీరో టికెట్లు కూడా 9 కోట్ల వరకు దాటినట్లు పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన 28 లక్షల మంది ప్రయాణించగా.. 12న 28 లక్షలు, 13న 31 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు చెప్పారు.
అయితే పండుగల వేళ మహిళా ప్రయాణికులు సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు ముందుగానే ఊహించారు. ఇందుక తగ్గట్లుగానే ప్రణాళికలు వేశారు. ముందుగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా అయింది. దీంతో ఈనెల 11, 12,13 తేదీల్లోనే 4,400 వరకు ప్రత్యేక బస్సులు నడిపినట్లు అధికారులు చెప్పారు. మొత్తంగా చూసుకుంటే ఈ సంక్రాంతి పండుగకు ఏకంగా 6,261 బస్సులు నడిపినట్లు వివరించారు.