మన Enadu: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పథకాలతో పాటుగా రేషన్ పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో భారీగా రేషన్ బియ్యం పక్కదారి పడుతోందని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇటీవల భారీగా రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.. కేసులు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో రేషన్ పంపిణీలో అవకతవకలకు అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా డీలర్ల రేషన్ లాగిన్కు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో రేషన్కార్డులు ఉన్నవారికి ముఖ్యమైన గమనిక. లబ్ధిదారులకు అందాల్సిన రేషన్ బియ్యం భారీగా ఎత్తున పక్కదారి పడుతుండటంతో చౌక ధరల దుకాణాలపై పౌరసరఫరాల శాఖ ఫోకస్ పెట్టింది. పెద్దసంఖ్యలో బినామీ డీలర్లు ఉన్నారన్న ఆరోపణలు రావడంతో.. డీలర్షిప్ల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రేషన్ ‘లాగిన్’ను కుటుంబ సభ్యులకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా 17 వేల మందికిపైగా రేషన్ డీలర్లు ఉన్నారు. వీరిలో కొందరు తమ రేషన్ దుకాణాల్ని అనధికారికంగా ఇతరులకు అప్పగించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం వెనుక పెద్దమొత్తంలో చేతులు మారినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబరు నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు.. రెండున్నర నెలల వ్యవధిలో అక్రమంగా తరలిస్తున్న 7,629 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. బాధ్యులపై కేసులు నమోదు చేయగా.. మరోవైపు ప్రక్షాళనల కూడా చేస్తోంది.
రేషన్ షాపులకు వచ్చే లబ్ధిదారులకు బియ్యం, చక్కెర వంటి సరకులు ఇవ్వాలంటే ఈ-పాస్ మిషన్లో డీలర్ తన వేలిముద్ర ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. అనారోగ్యం, ఇతర సందర్భాల్లో పౌరసరఫరాల శాఖ ప్రత్యేక వెసులుబాటు ఇచ్చింది. డీలర్ ప్రతిపాదించిన మరో ముగ్గురికి రేషన్ ‘లాగిన్’ ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని.. తమ బంధువుల పేరుతో కొందరు బినామీల్ని రంగంలోకి దించారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఇతర నగరాలు, పట్టణాల్లో బినామీ డీలర్లు గణనీయ సంఖ్యలో ఉన్నట్లు కొద్ది వారాల క్రితం పౌరసరఫరాల శాఖకు ఫిర్యాదులు అందాయి.