Mana Enadu:కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . కొత్త కార్డులు జారీచేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి కొత్త రేషన్కార్డుల కోసం బీపీఎల్ కుటుంబాలు కొత్త కార్డుల దరఖాస్తు చేస్తుకునేందుకు ఎదురు చూస్తున్నాయి.
‘మీ-సేవ’లో పోర్టల్ మాత్రం ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ‘మీ-సేవ’ పోర్టల్ ఓపెన్ చేసి, కొత్తగా దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలాఉండగా రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులను చేర్చుకోవటానికి కూడా దరఖాస్తులు వస్తున్నాయి. అంటే.. ఒక కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉంటే.. భార్యాభర్తల పేర్లు కార్డులో ఉండి పిల్లల పేర్లు లేకపోయినా, ఇద్దరు పిల్లల్లో ఒకరి పేరే ఉన్నా.. ‘మెంబర్ ఎడిషన్ (కొత్త సభ్యుల చేర్పులు, మార్పులు)’ ఫ్రొఫార్మాలో తీసుకుంటారు.
అధికారంలోకి రాగానే కొత్తరేషన్ కార్డులు జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. కానీ, అధికారంలోకి వచ్చాక లోక్సభ ఎన్నికలు, ఇతర గ్యారెంటీల అమలుపై దృష్టిపెట్టడంతో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ప్రకటన నేపథ్యంలో.. మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 55 లక్షల కార్డులు కేంద్ర ప్రభుత్వం జారీచేసినవి. రాష్ట్ర ప్రభుత్వ కార్డులు 35 లక్షలు. కొత్త కార్డుల కోసం పోర్టల్ ఓపెన్ చేస్తే.. మరో 10 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆరు గ్యారెంటీల ఫార్మెట్లో కొత్త రేషన్ కార్డుల ప్రస్తావించలేదు. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రేషన్ కార్డులు దరఖాస్తులను తీసుకున్నారు. కానీ
అయితే ‘మీ-సేవ’లో మెంబర్ అడిషన్ పోర్టల్ ఓపెన్ చేసి ఉంది. దాంట్లో ఇప్పటివరకూ 11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త కార్డులు ఇచ్చే సమయంలోనే.. మెంబర్ అడిషన్పై కూడా నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ రెండు ప్రక్రియలూ పూర్తిచేస్తే రేషన్ కార్డుల సమస్య దాదాపుగా కొలిక్కివచ్చే అవకాశాలున్నాయి. కాగా.. రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ కోటాలో ఉన్న 35 లక్షల రేషన్ కార్డులను కూడా సెంట్రల్ కోటాలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ఢిల్లీకి లేఖలు రాసింది. కానీ కేంద్రం నుంచి ఇంతవరకూ ఎలాంటి స్పందనా లేదు.