కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టనునట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేపట్టిన పథకం జలయజ్ఞం కాదని ధనయజ్ఞంగా మారిని సంగతి తెలుసన్నారు. కేంద్రంలోనూ, ఏపీ, మహారాష్ట్రలోనూ ఆ పార్టీ గతంలో అధికారంలో ఉన్నా ప్రాజెక్టుల కోసం అనుమతులు తీసుకురాలేదన విమర్శలు చేశారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని కేంద్ర జలసంఘం చెప్పిందన్నారు. అక్కడి కంటే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఎక్కువ ఉందన్నారు. అందుకే కాళేశ్వరం ప్రారంభించామని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్రతో ఉన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నామని పేర్కొన్నారు. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ కాదని15 రిజర్వాయర్లు, 21 పంప్హౌజ్లు, 201 కిలోమీటర్ల సొరంగాలు. 88 మీటర్ల నుంచి 618 మీటర్లకు నీటిని లిఫ్ట్ చేశామన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించుకోవడం జరిగిందన్నారు. కాళేశ్వరం జలాలతో వాగులు, చెరువులనూ నింపుకున్నామని తెలిపారు. వీటితోనే భూగర్భ జలాలు పెరిగాయన్నారు. కాళేశ్వరం వల్ల పాతాళగంగ పైకి రావడం జరిగిందన్నారు.
మేడిగడ్డలో 84 పిల్లర్లు ఉంటే 3 కుంగిపోయాయని, బ్యారేజీ మొత్తం కొట్టుకుపోయినట్లు ప్రచారం చేస్తుండటం సిగ్గు చేటన్నారు. గతంలో ఫరక్కా బ్యారేజీలోనూ ఇలా జరిగిందన్నారు. 1957లో కడేం ప్రాజెక్టే కొట్టుకుపోయిందని గుర్తు చేశారు. ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లోనూ సమస్యలు వచ్చాయన్నారు. కాఫర్ డ్యామ్ కట్టి మేడిగడ్డకు మరమ్మతులు చేయవచ్చు. 2 నెలల్లో మేడిగడ్డకు మరమ్మతులు చేసి నీళ్లు ఇవ్వవచ్చు.
సీఎం తీరు చూస్తే కాళేశ్వరంపై కుట్ర చేస్తున్నారని అనిపిస్తుంది. మార్చి 1 నుంచి భారాస చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టనుంది. 150 నుంచి 200 మంది పార్టీ ప్రతినిధులతో అక్కడికి వెళ్తున్నాం. తెలంగాణ భవన్ నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా తొలి రోజు కాళేశ్వరం వెళ్తాం. ఈ ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెట్టి వాస్తవాలు తెలియజేస్తామని కేటీఆర్ వివరించారు.