ManaEnadu:వామపక్ష యోధుడు, ప్రముఖ రాజకీయవేత్త, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) (72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో దిల్లీ ఎయిమ్స్లో కొన్నిరోజులుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో ఇవాళ (సెప్టెంబరు 12వ తేదీ 2024) తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో ఆయన మృతిపట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
సీతారాం ఏచూరి మరణం పట్ల కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. ఆయన తనకు మంచి స్నేహితుడని, దేశం గురించి లోతైన అవగాహన ఉన్న నాయకుడని కొనియాడారు. ఆయనతో సుదీర్ఘ సమావేశాలను మిస్ అవుతానంటూ ఎమోషనల్ అయ్యారు. మరోవైపు కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమంలో సాటిలేని నాయకుడు ఏచూరి అని కొనియాడారు. మరోవైపు సీతారం మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటు అని బంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.
సీతారాం ఏచూరి మరణంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని కొనియాడారు. మరోవైపు ఏచూరి మృతి పట్ల సంతాపం తెలిపిన మాజీ సీఎం కేసీఆర్ (KCR), ఆయన సామ్యవాద భావాలు కలిగిన నాయకుడని అన్నారు. విద్యార్థి నాయకుడిగా, సీపీఎం కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఏచూరి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితకాలం పనిచేసిన వ్యక్తి సీతారాం ఏచూరి అని మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi sanjay) కీర్తించారు.
సీతారాం ఏచూరి మృతిపట్ల మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) సంతాపం ప్రకటించారు. ఏచూరి అవిశ్రాంత పోరాట యోధుడు అని అన్నారు. ప్రతిపక్షాల ఐక్యతకు కృషి చేసిన జాతీయ నేత ఏచూరి అని కొనియాడారు .మరోవైపు వామపక్ష నేత బీవీ రాఘవులు మాట్లాడుతూ సీతారాం ఏచూరిని కోల్పోవటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో ఒక స్థితప్రజ్ఞుడిని కోల్పోయామని అన్నారు. సీతారాం ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu Naidu) అన్నారు. అట్టుడుగువర్గాలతో ఆయనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు.






