పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వామపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే తమకు పట్టు ఉన్న కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీసీఐ) పార్టీ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే నలుగరు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
తాజాగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) (సీపీఎం) పార్టీ 15 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీపీఎం పార్టీ రాష్ట్ర సెక్రటరీ ఎంవీ గోవిందన్ లోక్సభలో పోటీచేసేవారి జాబితాను విడుదల చేశారు.
ఎల్డీఎఫ్ మిత్రపక్షమైన సీపీఎం.. మొత్తం 20 లోక్సభ స్థానాల్లో నాలుగు స్థానాలను ఇప్పటికే సీపీఐకి కేటాయించింది. గతంలో రాష్ట్ర ఆరోగ్య శాఖకు మంత్రిగా సేవలందించిన కేకే శైలజా(శైలజా టీచర్)ను సీపీఏం.. లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దించుతోంది. ఆమెకు వడకర లోక్సభ నియోజకవర్గాన్ని కేటాయించింది. థామస్ ఐజాక్ పతనంతిట్ట సెగ్మెంట్ నుంచి పోటీ చేయనున్నారు. మరో సీటును కేరళలోని కాంగ్రెస్(ఎం)కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షపార్టీ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ తిరిగి అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాయకత్వంలోని కొత్త మంత్రివర్గంలో కేకే శైలజకు మాత్రం చోటు దక్కలేదు. ఆమె రెండోసారి ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రతి ఒక్కరు భావించినప్పటికీ.. పార్టీ ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ఇక.. 2018లో ఆరోగ్య మంత్రిగా చేసిన సమయంలోనూ ప్రాణాంతక నిపా వైరస్ను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలతో కేకే శైలజా అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.