ManaEnadu:శ్రావణ మాసం.. లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసాల్లో ఒకటి. ఈ మాసంలో మహిళలు వ్రతాలు, నోములు, పూజలతో దైవ ధ్యానంలోనే ఎక్కువగా గడిపేస్తుంటారు. ఈ మాసంలో ఎక్కువగా మహిళలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. వరాల తల్లి వరలక్ష్మీ దేవి అనుగ్రహం కోసం తమకు తోచినట్టుగా, స్తోమతకు తగిన విధంగా ఈ వ్రతం జరుపుకుంటారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మీ వ్రతం ముహూర్తుం కుదిరింది. మరి ఆ రోజున వ్రతం చేసే మహిళలు ఏ చీరకట్టుకుని చేస్తే అమ్మవారి అనుగ్రహం మరింత ఎక్కువగా ఉంటుందో చూద్దామా.. ?
వరలక్ష్మీ వ్రతం రోజున మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజ చేస్తారు. అయితే ఈ పూజ సమయంలో వారు ఏ రంగు చీరైనా కట్టుకోవచ్చని ప్రముఖ జ్యోతిష్య పండితులు మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు. శ్రీశుక్తంలో మొదటి శ్లోకం ప్రకారం లక్ష్మీదేవికి బంగారు రంగు చీర అంటే ఇష్టమని చెప్పారు. బంగారపు రంగు ఉండే చీరను ధరించి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆకుపచ్చ రంగు చీర కూడా ధరించొచ్చని చెప్పారు. గులాబీ రంగు చీర ధరించి వరలక్ష్మీ వ్రతం చేస్తే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు. అయితే ఆ రంగు చీరలు అందుబాటులో లేకపోయినా.. మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిస్తే తప్పకుండా అనుగ్రహం ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పద్మాపురాణంలో చెప్పిన విధంగా పూజిస్తే ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. పద్మాపురాణం ప్రకారం.. లక్ష్మీదేవి అగ్ని నుంచి జన్మించిందని… అందుకే మంగళ, శుక్రవారాల్లో ఆగ్నేయ మూలలో ఇంట్లో దీపం వెలిగిస్తుండాలని తెలిపారు. ఆగ్నేయ మూలలో పీట పెట్టి, అష్టదళ పద్మం ముగ్గు వేసి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.