Mana Enadu : బాలీవుడ్ స్టార్ హీరో విక్రాంత్ మాస్సే (Vikrant Massey) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ’12th ఫెయిల్ (12th Fail)’ సినిమాతో విక్రాంత్ భారతీయ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాడు. అయితే ఈ 37 ఏళ్ల యువ నటుడు తాజాగా తన అభిమానులకు ఓ షాక్ ఇచ్చాడు. తాను కొంత కాలంపాటు కొత్త సినిమాలు చేయనని.. బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. ఆ పోస్టులో ఏం ఉందంటే..?
మీ ప్రేమను ఎప్పుడూ మరిచిపోలేను
“గత కొన్నేళ్లుగా మీ అందరి నుంచి అసాధారణమైన ప్రేమాభిమానాలు పొందుతున్నాను. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. నా కుటుంబ సభ్యులకు ఇక పూర్తి సమయాన్ని కేటాయించాల్సిన సమయం వచ్చింది. అందుకే కొన్నాళ్ల పాటు కొత్త సినిమాలను అంగీకరించడం లేదు. 2025లో విడుదల కానున్న సినిమానే నా చివరిది. నేను నటించిన సినిమాలపై మీరు చూపిన ఆదరాభిమానాలను ఎప్పుడూ మర్చిపోలేను. ఎన్నో అందమైన జ్ఞాపకాలను అందించిన మీ అందరికీ కృతజ్ఞతలు” అంటూ ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు విక్రాంత్.
View this post on Instagram
అలా ఎందుకు చేశారు?
విక్రాంత్ పోస్ట్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. సడెస్గా ఈ హీరో ఇటువంటి డెసిషన్ తీసుకోవడం ఏంటని బాధపడుతున్నారు. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్టు కాదని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఇదేదో ప్రమోషనల్ స్టంట్లా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరేదైనా రీజన్ ఉంటే చెప్పండి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
బుల్లితెర నుంచి వెండితెరపై
ఇక విక్రాంత్ సినీ కెరీర్ విషయానికి వస్తే, హిందీలో పలు సీరియల్స్తో ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు.. తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ముఖ్యంగా విక్రాంత్ నటించిన Balika Vadhu (చిన్నారి పెళ్లికూతురు) చాలా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2017లో ‘ఎ డెత్ ఇన్ ది గంజ్ (A Death In The Gunj)’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు అందుకున్నాడు. గతేడాది విడుదలైన ’12th ఫెయిల్’తో భారతీయ ప్రేక్షకుల మనసు గెలిచాడు.