Phone Tapping Case Updates: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం సీరియస్గా తీసుకుంది. ఫొన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసి కీలకమైన అధికారులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అప్పటి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కీలక నిందితుడిగా ఉన్నారు.
ప్రభాకర్ రావును ప్రశ్నిస్తే కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఆయన వెల్లడించే సమాచారం ఆధారంగా బీఆర్ఎస్ నాయకులు నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ ఉన్న సమంయలో రాజకీయ, వ్యాపార ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. వారు పోలీసు కస్టడీలో ఉన్నారు. అలాగే టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధా కిషన్ రావుకు న్యాయస్థానం 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.
రాధా కిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలిచ్చేవారనే వివరాలు సేకరించారు. డీఎస్పీ ప్రణీత్ రావు.. విపక్ష నేతల , ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. వాటిపైనా సిట్ ప్రశ్నించింది. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లనాని పోలీస్శాఖ ఉన్నతాధికారికి తెలిపారు. కానీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంతో ప్రభాకర్ చేసేదేమి లేక పోలీసుల విచారణకు సోమవారం మధ్యాహ్నం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు రానున్నట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కు చాలా మంది ప్రముఖులు విరాళాలు ఇచ్చారని సిట్అ ధికారులు గుర్తించారు. ప్రభాకర్రావు, రాధా కిషన్రావుకు చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జ్యువెలరీ షాపుల యజమానులు లంచాలు ఇచ్చారని సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లును రాధాకిషన్రావుతో కలిపి ఇప్పటికే ప్రశ్నించారు. ఎస్ఐబీ, టాస్క్ఫోర్స్ల్లో విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందినీ సిట్ విచారిస్తోంది. మొత్తం 47 మంది నుంచి వివరాలు సేకరించింది.