ManaEnadu:భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల యుద్ధభూమి ఉక్రెయిన్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం గురించి ప్రస్తావిస్తూ.. యుద్ధభూమిలో ఎప్పుడూ శాంతికి పరిష్కారం దొరకదని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంశంలో భారత్ ఎప్పుడూ తటస్థంగా లేదని, ఎల్లప్పుడూ శాంతి వైపే ఉందని పునరుద్ఘాటించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చలు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లో మోదీ పర్యటనపై అమెరికా స్పందించింది. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ ఉక్రెయిన్లో పర్యటించడాన్ని కొనియాడుతూ.. ఈ పర్యటన ద్వారా భారత ప్రధాని శాంతి సందేశం పంపారని పేర్కొన్నారు. మోదీ సందేశం ఇప్పటివరకు కొనసాగుతున్న మానవతా సాయానికి మద్దతుగా నిలిచిందని వ్యాఖ్యానించారు.
‘‘పోలండ్, ఉక్రెయిన్లో మోదీ ఇటీవలి పర్యటన గురించి చర్చించడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడాను. ఆయన శాంతి సందేశం, మానవతావాద మద్దతు మెచ్చుకోదగ్గవి. ఇండో-పసిఫిక్లో శాంతి, శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి మేం కూడా సిద్ధంగా ఉన్నామని మా నిబద్ధతను మరోసారి తెలియజేశాం’’ అని బైడెన్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
మరోవైపు బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ఇరువురు నేతలు చర్చించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆ దేశంలో హిందువులు సహా మైనారిటీలందరికీ భద్రత లభించేలా చూడాల్సి ఉందని అభిప్రాయపడినట్లు వెల్లడించారు. ప్రాంతీయ, ప్రపంచవ్యాప్త పరిణామాలెన్నో తమ మధ్య సమగ్రంగా చర్చకు వచ్చాయని, పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నామని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
గత నెల మోదీ చేపట్టిన రష్యా పర్యటనపై ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, ఉక్రెయిన్లు ఈ పర్యటనపై అసహనం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 23న ఉక్రెయిన్లో మోదీ పర్యటించడంతో ఆ విమర్శలను సమర్థంగా ఎదుర్కోవడానికే ఆయన ఈ పర్యటన చేపట్టారనే విశ్లేషణలు వచ్చాయి.








