ManaEnadu:వానాకాలంలో సీజనల్ వ్యాధుల (Seasonal Diseases)తో ఇబ్బందులు తప్పవు. జాగ్రత్తగా లేకుండా జ్వరాల బారిన పడి బాధపడక తప్పదు. అందుకే కాస్త ముందు జాగ్రత్తలతో, అప్రమత్తంగా పరిశుభ్రంగా ఉంటే వైరల్ ఫీవర్స్ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఈ కాలంలో వచ్చే జ్వరాల్లో ప్రాణాంతకమైనది డెంగీ జ్వరం (Dengue Fever). చాలా రాష్ట్రాల్లో ప్రజలు ఈ జ్వరం బారిన పడి మరణించిన సంఘటనలున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక సర్కార్ డెంగీకి కట్టడి వేసేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
డెంగీపై కన్నడ సర్కార్ ఉక్కుపాదం..
కన్నడనాట డెంగీ జ్వరాలు (Karnataka Dengue Fevers) విపరీతంగా పెరిగిపోతున్నాయి. కర్ణాటకలో గత పదేళ్ల నుంచి ఎన్నడూ లేనంతగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాధుల వ్యాప్తిని కట్టడి చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ముందుగా ఈ జ్వరానికి మూలమైన డెంగీ దోమలపై ఉక్కు పాదం మోపాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే దోమల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టింది.
దోమ కనిపించిందో ఫైన్ తప్పదు..
ఇందులో భాగంగా ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, నిర్మాణ ప్రదేశాలు సహా ఇతర ప్రాంతాల్లో దోమల వ్యాప్తిని అరికట్టే నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే పట్టణ ప్రాంతాల్లో దోమల స్థావరాలు కనిపిస్తే రూ.400, గ్రామీణ ప్రాంతాల్లో రూ.200 జరిమానా (Karnataka Dengue Fine) విధించాలని నిర్ణయించింది. కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలు, నివాస సముదాయాలు, ఆసుపత్రులు, రెస్టారెంట్ల వద్ద దోమలు కనిపిస్తే రూ.1000 (పట్టణ ప్రాంతాల్లో), గ్రామీణ ప్రాంతాల్లో రూ.500 ఫైన్ వేయనున్నట్లు కన్నడ ప్రభుత్వం ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ ప్రదేశాలకు రూ.2వేలు, గ్రామాల్లో వెయ్యి రూపాయలు ఫైన్ (Dengue Penalty) వేస్తామని వెల్లడించింది.
వారిదే బాధ్యత..
కర్ణాటకలో ఈ ఏడాది ఇప్పటి వరకు 24,500 కేసులు (Karnataka Dengue Cases) రికార్డయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరణాల సంఖ్య ఎక్కువగా లేకపోయినా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. కట్టడి చర్యల్లో భాగంగా కర్ణాటక ఎపిడమిక్ డిసీజెస్ రెగ్యులేషన్-2020లో సవరణలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు పార్కులు, వాణిజ్య సముదాయాలతోపాటు భవన, ఆయా ప్రదేశాల యజమానులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నమాట.