ManaEnadu:ప్రస్తుతం నేటి తరం యువత ఐటీ ఉద్యోగాలపైనే ఎక్కువ మక్కువ చూపుతోంది. దానికి కారణం భారీ ప్యాకేజీలు. వర్క్ లోడ్ ఎంతున్నా.. ఎంత ఒత్తిడి పెట్టినా.. కార్పొరేట్ కల్చర్కు అలవాటు పడలేకపోయినా.. అన్ని కష్టాలు తట్టుకునైనా సరే ఐటీ ఉద్యోగాన్నే చేయాలనుకుంటున్నారు. భారీ ప్యాకేజీలు నేటి తరం యువతను ఆ వైపునకు ప్రోత్సహిస్తున్నాయి. ఎమ్మెన్సీ కంపెనీలు పెద్ద మొత్తాల్లో శాలరీ ఆఫర్ చేస్తూ యువతను అట్రాక్ట్ చేస్తున్నాయి. అలాంటి కంపెనీల్లో ఒకటి కాగ్నిజెంట్. అయితే ఈ ప్రముఖ ఐటీ కంపెనీపై తాజాగా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకంటే..?
ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ 2024 గ్రాడ్యుయేట్ బ్యాచ్ ఫ్రెషర్ల నుంచి ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్కు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆగస్టు 14వ తేదీని లాస్ట్ డేట్గా ఈ అప్లికేషన్లకు ఫిక్స్ చేసింది. ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా అనే ఎక్స్ పేజీ ఈ జాబ్ వివరాలను పోస్ట్ చేసింది. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్టుపై ప్రస్తుతం నెట్టింట పెద్ద రచ్చ జరుగుతోంది. విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఒక్కరోజులోనే దాదాపు 2 మిలియన్ల వ్యూస్ లభించాయి. ఇంతకీ ఆ ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయంటే.. దానికి కారణం ఈ జాబ్ పోస్టింగ్లో ఫ్రెషర్కు ఏడాదికి రూ.2.5 లక్షలు ఇస్తామని పేర్కొనడమే.
ఇది చూసి నెటిజన్లు కాగ్నిజెంట్పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంత తక్కువ ప్యాకేజీనా అంటూ మండిపడుతున్నారు. ‘ఏడాదికి రూ.2.52 లక్షలు అంటే.. నెలకు సుమారు రూ.20వేలు. ఓ పనిమనిషి ఒక్కో ఇంట్లో అరగంట చొప్పున రోజుకు 8-10 ఇళ్లల్లో పనిచేస్తే ఇంతకంటే ఎక్కువ జీవితం వస్తుంది’. అని ఒకరు కామెంట్ చేశారు. మరో యూజరేమో.. ‘ట్యూషన్లు చెప్పినా ఇంతకంటే ఎక్కువ పైసలు వస్తాయి’ అని కామెంట్ పెట్టాడు. ఇక ఇంకో నెటిజన్ అయితే ఏకంగా ఈ జాబ్ కంటే.. ‘వీధిలో తోపుడు బండ్ల వ్యాపారమే నయం.. ఇంకా ఎక్కువ డబ్బులొస్తాయి’ అంటూ రాసుకొచ్చాడు. ‘ఏడాదికి రూ.2.5 లక్షలు అంటే.. ఆ జీతంతో హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో నెల గడవడం చాలా కష్టమంటూ’ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.







