Mana Enadu:సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన వారిలో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ఒకరు. ఆయన ఓ సినిమా సైన్ చేశారంటే.. అందులో తన పాత్ర హీరో, విలన్, సైడ్ యాక్టర్ ఇలా ఏం చూడరు.. ఆ కథకు తన పాత్ర బలం చేకూరుస్తుందా అన్నది మాత్రమే చూస్తారు. అందుకే ఆయనకు ఫాలోయింగ్ ఎక్కువ. విజయ్ సేతుపతి సినిమా వస్తుందంటే తప్పకుండా చూసి తీరాల్సిందేనని ప్రేక్షకులు భావిస్తుంటారు. అలాంటి విజయ్ ఓ సినిమాను పదే పదే చూస్తారట. ముఖ్యంగా తన జీవితంలో కష్టాలు ఎదుర్కొన్న సమయంలో ఆ చిత్రాన్ని చాలా సార్లు చూశారట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..?
తాను కష్టాల్లో ఉన్నప్పుడు మహేశ్ బాబు నటించిన ‘అతడు’ సినిమాను రిపీట్ మోడ్లో చూసినట్లు విజయ్ సేతుపతి చెప్పారు. అందులో మహేశ్ బాబు ఎంట్రీ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి సీన్ తనకు గుర్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అన్ని సీన్లు తనకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయని చెప్పారు. ఇక ఆ సినిమాలో ఎమోషన్ తనకు బాగా నచ్చిందని.. త్రివిక్రమ్ ఎమోషనల్ సీన్స్ను అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. ఆ చిత్రంలో పార్థు – పూరీ (మహేశ్ – త్రిష)ల మధ్య రొమాన్స్ కూడా నచ్చిందని చెప్పుకొచ్చారు. బ్రహ్మానందం కామెడీ సన్నివేశాలు, పాటలు అన్నీ తనకు ఇష్టమని వెల్లడించారు.
ఇక విజయ్ సేతుపతి వంటి వర్సటైల్ హీరో తమ అభిమాన నటుడు మహేశ్ బాబును, ఆయన చిత్రాన్ని పొగడటంతో సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ తెగ సంబురపడి పోతున్నారు. విజయ్ సేతుపతి కామెంట్స్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా నటించిన ‘అతడు’ 2005లో విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో కంటే టీవీలో ఎక్కువగా ఆదరణ పొందింది.