కేసీఆర్ అవినీతి కారణంగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం సహకారంతోనే తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.
రాహుల్ గాంధీతో (Rahul Gandhi) కలిసి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleshwaram Project) సందర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తో పాటు కాళేశ్వరం కరెప్షన్ రావు అనే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. నాసిరకం పనులతో వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని నిప్పులు చెరిగారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగిపోయాయని ఆరోపించారు. 25వ పిల్లర్ నుంచి 1వ పిల్లర్ వరకు పూర్తిగా కుంగిపోయిందన్నారు. పిల్లర్లు రెండున్నర ఫీట్లు కుంగిపోయిందని అధికారులే స్వయంగా చెబుతున్నారన్నారు. మెడిగడ్డ సగం ప్రాజెక్టు కూల్చాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మిగతా సగం ప్రాజెక్టు పరిస్థితి కూడా సాంకేతిక నిపుణులు పరిశీలిస్తేనే ఏంటనేది తెలుస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేసిన L&T కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు.
సంబంధిత ఇంజనీర్లు, సీడీఓపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందన్నారు. గుడిని గుడిలో లింగాన్ని దిగమింగిన కేసీఆర్ ను తెలంగాణ సమాజం శిక్షించాలని కోరారు. ‘కేసీఆర్ పాపం పండింది… కేసీఆర్ అవినీతి కుండ పగిలింది.. మేడిగడ్డ కుంగింది’ అంటూ సంచలన వాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. లక్ష కోట్ల ప్రజాధనం గోదావరిలో పోసిన పన్నీరయిందని ధ్వజమెత్తారు.