Mana Enadu: గంటల తరబడి కూర్చొని వర్క్ చేస్తున్నారా? అయితే మీ హెల్త్ డేంజర్ జోన్లో ఉన్నట్లే. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఇలా వర్క్ చేయడం కామన్ అయిపోయింది. అయితే కూర్చొని గంటల తరబడి కదలకుండా పని చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట. వీరిలో ఇతరులతో పోలిస్తే 38 శాతం ముందస్తు ప్రమాదం ఉందని తాజా అధ్యయనం చెబుతోంది. నార్వేలోని ట్రోమ్స్ యూనివర్సిటీ, డెన్మార్క్లోని అర్హస్ వర్సిటీ పరిశోధకులు చేపట్టిన స్టడీలో ఈ విషయాన్ని గుర్తించారట.
వచ్చే సమస్యలు ఇవే..
రోజుకు 12 గంటల కంటే ఎక్కువ టైమ్ కూర్చొని పనిచేసిన వారికి మరణ ప్రమాదం అధికంగా ఉంటుందట. దీని వల్ల వెన్నుపూసపై ఒత్తిడి పెరిగి వెన్నునొప్పి వస్తుంది. తలను ఒకే స్థానంలో పట్టుకుని ఉండటం వల్ల మెడ కండరాలు బిగుసుకుపోతాయట. కదలకుండా కూర్చొని ఉండటం వల్ల రక్తం సరిగా ప్రసరించదు. దీని వల్ల రక్తనాళాలలో గడ్డలు కట్టే ప్రమాదం ఉంది. పైగా శరీరానికి శ్రమ లేకపోవడం వల్ల కేలరీలు ఖర్చు కావు.

దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయం రావడంతోపాటు అధిక బరువు పెరుగుతారట. ముఖ్యంగా ఊబకాయం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. కదలకుండా కూర్చొని ఉండటం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి, రక్తపోటు పెరిగి గుండె సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు మానసిక స్థితి చెడిపోయి నిరాశ, బాధ వంటి భావనలు కలుగుతాయి. ఇదిలా ఉంటే గంటలకొద్దీ డ్రైవ్ చేయడం కూడా భవిష్యత్తులో అనేక రకాల సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అందుకే ఇవి చేయాలి..
రోజూ 20-25 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా ప్రమాదాన్ని కొంతమేర తగ్గించవచ్చు. అందుకు వేగంగా నడవటం, పిల్లలతో ఆడుకోవడం, యోగా చేయడం, రన్నింగ్ చేయడం, స్టెప్స్ ఎక్కడం, దిగడం, స్విమ్మింగ్ చేయడం వంటివి చేస్తే ఆరోగ్యకరంగా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ట్రై చేయండి.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.









